ముంబై ఫ్యామిలీ మృతిలో బిగ్ ట్విస్ట్.. ప్రాణం తీసింది పుచ్చకాయ కాదా?

  • ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి
  • పుచ్చకాయ తినడం వల్లే మరణించారని తొలుత అనుమానం
  • బాధితుల అవయవాలు ఆకుపచ్చగా మారాయని ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్ట్
  • తండ్రి శరీరంలో మార్ఫిన్ ఆనవాళ్లు.. విషప్రయోగం కోణంలో పోలీసుల దర్యాప్తు
  • పుచ్చకాయలో ఎలాంటి రసాయనాలు లేవని తేల్చిన ఆహార భద్రతా విభాగం
ముంబైలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారన్న వార్త తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణలో ఇప్పుడు కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరిగిన మరణాలు కావని, పక్కాగా విషప్రయోగం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడైన అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

దక్షిణ ముంబైకి చెందిన వ్యాపారి అబ్దుల్లా డొకాడియా (45), ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13) గత నెల 26న మరణించారు. అంతకుముందు రోజు రాత్రి వారు పుచ్చకాయ తిన్న తర్వాత వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పుచ్చకాయలో విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి ఉంటారని భావించారు.

అయితే, ఫోరెన్సిక్ ప్రాథమిక పరీక్షల్లో బాధితుల మెదడు, గుండె, పేగులు సహా కొన్ని అంతర్గత అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు తేలింది. అంతేకాకుండా, తండ్రి అబ్దుల్లా డొకాడియా శరీరంలో 'మార్ఫిన్' అనే శక్తివంతమైన పెయిన్‌కిల్లర్ ఆనవాళ్లను గుర్తించారు. సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కేసుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు, రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) అధికారులు పుచ్చకాయతో పాటు ఇంట్లోని ఆహార నమూనాలను పరీక్షించి, వాటిలో ఎలాంటి కృత్రిమ రసాయనాలు లేవని నివేదిక ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసినప్పటికీ, హత్య లేదా ఆత్మహత్య కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. తుది ఫోరెన్సిక్ నివేదిక వస్తే గానీ ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ వీడదని అధికారులు తెలిపారు.

Abdulla Dokadia
Mumbai family death
watermelon poisoning
food poisoning
Nasreen Dokadia
Ayesha Dokadia
Jainab Dokadia
forensic report
morphine
crime news

More Telugu News